Ticker

6/recent/ticker-posts

దుర్గగుడిలో మహా కుంభాభిషేక మహోత్సవం.. సీఎంకు ఆహ్వానం


విజయవాడ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో ఈ నెల 6 నుంచి 8 వరకు కుంభాభిషేక మహోత్సవం జరగనుంది. ఈ మహోత్సవానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఆలయ అధికారులు ఆహ్వానం అందజేశారు. ఈరోజు(మంగళవారం) దుర్గా దేవస్థానం పాలక మండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ ఈవో శీనా నాయక్‌.. సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానపత్రిక అందజేశారు. అర్చకులు స్వామివార్ల చిత్రపటం, ప్రసాదం అందజేసి.. సీఎంకు ఆశీర్వచనాలు అందించారు.


విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరిగే కుంభాభిషేక మహోత్సవానికి మంత్రి నారా లోకేశ్‌కు ఆహ్వానం అందించారు అధికారులు. కుంభాభిషేకానికి రావాల్సిందిగా లోకేశ్‌కు దేవస్థానం అర్చకులు, పాలకవర్గం ఆహ్వానపత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఆగమ శాస్త్రాల ప్రకారం 12 ఏళ్లకు ఒకసారి ఇంద్రకీలాద్రిపై మహా కుంభాభిషేకం నిర్వహిస్తారు. ఈ మహా కుంభాభిషేక మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 6 నుంచి 8 వరకు మూడు రోజుల పాటు జరిగే మహా కుంభాభిషేకానికి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.